Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు: కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు మరియు కందుకూరు సబ్ కలెక్టర్ దామెర హిమవంశీతో కలిసి గురువారం మెంథా తుఫాన్ ప్రభావంతో వరదలకు గురైన కందుకూరు పట్టణ ప్రజలకు పట్టణంలోని మూడో నెంబర్ రేషన్ షాప్ వద్ద తుఫాను బాధితులకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, భారీ తుఫాన్ సంభవించినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందస్తు చర్యలతో ఎక్కువ మొత్తంలో నష్టం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, పునరావాస కేంద్రాల్లో మూడు పూటల భోజనం, వైద్య సదుపాయాలు కల్పించారు. ఇప్పుడు వారు తిరిగి గృహాలకు చేరిన తర్వాత, వారి అవసరాల కోసం నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న తుఫాను బాధిత ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం తోపాటు ప్రతి కుటుంబానికి అదనంగా 1 కిలో బంగాళాదుంపలు,1 కిలో పామాయిల్,1 కిలో కందిపప్పు,1 కిలో ఉల్లిపాయలు,1 కిలో చక్కెర వంటి ఐదు రకాల నిత్యావసర వస్తువులు అందజేయడం జరిగిందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కే. అనూష, తహసిల్దార్ లావణ్య, ప్రకాశం జిల్లా డైరీ మాజీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, కూటమి పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi