Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : టిడిపిలో చేరిన 15 కుటుంబాలు గుడ్లూరు, అమరావతి జ్యోతి: గుడ్లూరు మండలం మోచర్ల పంచాయతీలోని తెట్టు గ్రామానికి చెందిన 15 కుటుంబాల వారు ఆదివారం వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరారు. తెట్టు గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారందరికీ కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు పసుపు కండువాలు కప్పి పార్టీలో ఆహ్వానించారు. పంచాయతీ 10 వ వార్డు సభ్యుడు సయ్యద్ సుభాని, దర్గా మాజీ ప్రెసిడెంట్ షేక్ సుల్తాన్ బాషా, దర్గా మాజీ ప్రెసిడెంట్ మహబూబ్ బాషా, యనమల బాలకృష్ణ, షేక్ సుల్తాన్, షేక్ రియాజ్, మస్తాన్ వలీ, షేక్ బాదుల్లా, కోటేశ్వరరావు, కన్నెగంటి రామమూర్తి, యాకసిరి శివ, పోట్లూరి మణి, చలంచర్ల ప్రభాకర్, పోట్లూరి శ్రీనివాసులు, చలంచర్ల గోపి కుటుంబాలు వారు పార్టీలో చేరారు. ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నాలుగున్నరేళ్ళు ఒక్క అభివృద్ధి పని కూడా చేయకుండా ఉతుత్తి కబుర్లు చెప్పి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. వైసిపి పాలనలో, వెనుకబడ్డ కందుకూరు నియోజకవర్గం మరింత తీవ్రంగా నష్టపోయిందన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో 99 శాతం పూర్తి చేశామని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నదంతా ఒట్టి అబద్ధమేనన్న విషయాన్ని నియోజకవర్గ ప్రజలు ఎప్పుడో గ్రహించారని, రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పటానికి సిద్ధంగా ఉన్నారని నాగేశ్వరరావు తెలిపారు. ముఖ్యంగా ముస్లింలు తమకు జరిగిన అన్యాయంపై ఆగ్రహంతో ఉన్నారని, అభివృద్ధి అన్నది కేవలం తెలుగుదేశం పార్టీతోనన్న వాస్తవాన్ని గ్రహించి తెలుగుదేశం పార్టీ వైపు అడుగులు వేస్తున్నారని నాగేశ్వరరావు అన్నారు. అతి త్వరలోనే వైసీపీ నుంచి భారీ స్థాయిలో నాయకులు, కార్యకర్తలు బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారని చెప్పారు. ముస్లిం నాయకుల రాకతో తెట్టు గ్రామంలో టిడిపి మరింత బలపడిందని, గ్రామంలో అందరూ కలిసిమెలిసి రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కృషి చేయాలని నాగేశ్వరరావు సూచించారు. తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో ఏర్పడబోయే ప్రభుత్వంలో, ప్రస్తుతం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు, ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. తనను మీలో ఒకరిగా భావించి, ఈసారి ఎమ్మెల్యేగా తనకు అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. మండల పార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, గ్రామ పార్టీ అధ్యక్షుడు మద్దసాని శ్రీనివాసులు, రాష్ట్ర మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి షేక్ రఫీ, నియోజకవర్గ ముస్లిం మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ నాయబ్ రసూల్, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు మద్దసాని కృష్ణ, మాజీ సర్పంచ్ మద్దసాని వెంకటేశ్వర్లు, స్థానిక నాయకులు షేక్ పెదబాబు, జిలాని, బుజ్జి, రఫీ, యర్రంశెట్టి వెంకటేశ్వర్లు, ఖాజామీయా, చిత్తారి మల్లికార్జున, గద్దగుంట శ్రీనివాసులు, పొట్టేళ్ల మురళి, పోలుగంగు కృష్ణ, మెడికల్ బాబు, గద్దగుంట రామకృష్ణ తదితర నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi