Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు కందుకూరు, అమరావతి జ్యోతి: ఉలవపాడు మండలంలో పలు గ్రామాలలో తుఫాన్ షెల్టర్లకు వెళ్లి, బాధిత కుటుంబాలను కందుకూరు టిడిపి ఇన్చార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు పరామర్శించారు. అక్కడ కల్పిస్తున్న వసతులు, ఇతర సౌకర్యాలపై ఆరా తీశారు. పండ్లు, బిస్కెట్ ప్యాకెట్లు, ఇతర ఆహార పదార్థాలను బాధితులకు అందజేశారు. విపరీతమైన గాలులు, భారీ వర్షం పడుతున్నా లెక్కచేయకుండా... పార్టీ నేతలతో కలిసివెళ్లి, మేమున్నామంటూ బాధితులకు ఇంటూరి నాగేశ్వరరావు భరోసా కల్పించారు. *మన్నేటికోట వద్ద జివిఆర్ సంఘంలో...* ముందుగా మన్నేటికోట పంచాయతీ పరిధిలోని జివిఆర్ ఎస్టి కాలనీలో నాగేశ్వరరావు పర్యటించారు. కాలనీ మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకోవడాన్ని గమనించారు. అక్కడ నుంచి పునరావాస కేంద్రానికి వెళ్లి బాధితులతో మాట్లాడారు. అక్కడ విద్యుత్ సరఫరా లేకపోవడాన్ని గమనించి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. వందమందికి పైగా ఉండే తమ కాలనీలో, ఒక్కరికికూడా పక్కా ఇళ్లు లేకపోవడం వల్ల వర్షాలు కురిసిన ప్రతిసారి ఇలాగే ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు తెలిపారు. గేదెలు, మేకలు, ఇతర మూగజీవాలను అక్కడే వదిలేసి వచ్చామని ఆవేదనతో చెప్పారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ గత ఏడాది కూడా ఇదే పరిస్థితి వచ్చిందని, అప్పుడు ఎవరూ పట్టించుకోకపోతే, కాలనీవాసులకు తాను అండగా నిలిచి నిత్యవసర వస్తువులు పంపిణీ చేసిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. *ఉలవపాడులో...* ఉలవపాడులోని కోటిరెడ్డి గుంట కాలనీలో, అక్కడివారు పడుతున్న బాధలను చూసి నాగేశ్వరరావు చలించిపోయారు. ఇళ్లచుట్టూ వరదనీరు చేరుకున్నప్పటికీ, వారంతా అక్కడే ఉండడాన్ని గమనించి ప్రశ్నించారు. పక్కనే ఉన్న ఎంపీడీవో కార్యాలయంలో తమను తలదాచుకోవాలని అధికారులు చెప్పారని, అయితే కాలనీలోని 80 మందికి అక్కడ చోటు సరిపోవటం లేదని బాధితులు తెలిపారు. దీంతో నాగేశ్వరరావు అక్కడ నుంచే అధికారులతో మాట్లాడి, కాలనీవాసులను మరో సురక్షిత ప్రాంతానికి తరలించాలని కోరారు. తరువాత వెంగారెడ్డి కుంట వాసులు ఆశ్రయం పొందుతున్న ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి వసతులు పరిశీలించారు. అక్కడ విద్యుత్ సౌకర్యం లేకపోవడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలోనే సబ్ కలెక్టర్ శోభిక అక్కడికి వచ్చారు. వివిధ చోట్ల పునరావాస కేంద్రాలలో వసతులు సరిగా కల్పించని విషయాన్ని నాగేశ్వరరావు సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సబ్ కలెక్టర్ బదిలిస్తూ అన్ని ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. *బాలకోటయ్య సంఘంలో...* అనంతరం కరేడు పంచాయతీలోని బాలకోటయ్య సంఘం వద్ద పునరావాస కేంద్రానికి నాగేశ్వరరావు వెళ్లారు. బాలకోటయ్య సంఘం, మర్రిచెట్టు సంఘం, వాక ప్రాంతాల్లోని సుమారు 250 మంది ఆశ్రయం పొందుతుండగా వారందరితోనూ నాగేశ్వరరావు మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. తమలో ఎక్కువమంది పూరిగుడిసెల్లో బతుకుతున్నారని, ఈ ప్రభుత్వంలో ఒక్క పక్కా ఇల్లు కూడా మంజూరు చేయలేదని నాగేశ్వరరావుకు తెలిపారు. పునరావాస కేంద్రంలో కనీస వసతులు లేవని, తాగేందుకు, వాడుక కోసం నీళ్లు కూడా అందుబాటులో ఉంచలేదని నాగేశ్వరరావు దృష్టికి తెచ్చారు. పార్టీ నాయకులు పోలుబోయిన శ్రీనివాసులు, అంచుపోగు వాసు, తొట్టెంపూడి మాల్యాద్రి, మల్లవరపు వెంకటరావు, కత్తి శివ, శ్రీను, చిమ్మిరి మోహన్ రావు, గొత్తుల జనార్ధన్, రాచగర్ల శివ తదితరులు నాగేశ్వరరావు వెంట ఉన్నారు.
Admin
Amaravathi Jyothi