Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : అమరజీవి.. భవిష్యత్తు తరానికి ఆదర్శనీయం - పొట్టి శ్రీ రాములు త్యాగఫలితమే మన రాష్ట్రం - కందుకూరులో ఘనంగా జరిగిన అమరజీవి విగ్రహావిష్కరణ - ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే ఇంటూరి - విగ్రహాలు మన గత చరిత్రకు నిదర్శనాలు - మహానుభావుల గొప్పతనాన్ని భవిష్యత్తు తరాలకు తీసుకువెళ్లాలి - ఎంపీ కందుకూరు: నెల్లూరు జిల్లా ముద్దుబిడ్డ, అమరజీవి శ్రీ పొట్టి శ్రీ రాములు జీవితం భవిష్యత్తు తరాలకు ఆదర్శనీయమని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అన్నారు. ఆదివారం కందుకూరు పట్టణంలో ఆర్యవైశ్య సభ్యులు నూతనంగా ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహ ఆవిష్కరణలో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ముందుగా కందుకూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకున్న ఎంపీ వేమిరెడ్డికి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తో కలిసి పట్టణంలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన అమరజీవి పొట్టి శ్రీ రాములు కాంస్య విగ్రహాన్ని ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే ఇంటూరి, డూండి రాకేష్ ఆవిష్కరించారు. విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లా ప్రతిష్టను దేశవ్యాప్తం చేసిన పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లావాసి కావడం గర్వించదగ్గ విషయమన్నారు. అలాంటి గొప్ప వ్యక్తిని గుర్తు చేసుకుంటూ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసిన కందుకూరు ఆర్యవైశ్య సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. విగ్రహాలు మన గత చరిత్రకు నిదర్శనాలని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా నాయకత్వంలో మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 45 వేల పాఠశాలల్లో మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఆర్యవైశ్యులు అంటే నమ్మకానికి పెట్టింది పేరని, భక్తిభావం ఉంటుందన్నారు. ప్రజలు గత ఎన్నికల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల ఏకైక నాయకుడు నారా చంద్రబాబునాయుడు మాత్రమేనని విశ్వసించి కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారని తెలిపారు. దానికి అనుగుణంగా మన ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంతోపాటు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నడిపించే విధంగా పని చేస్తుందని వివరించారు. ఎన్నికల సమయంలో ఆర్యవైశ్యులు ఎంతో మద్దతు ఇచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించారని చెప్పారు. ఎన్నికల సందర్భంగా ఆర్యవైశ్యులకు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చతామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ పెద్దలు నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మన నియోజకవర్గంలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ముందుగా కందుకూరు నియోజకవర్గం ఆర్యవైశ్యులు, ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. పొట్టి శ్రీరాములు మద్రాస్ రెసిడెన్సీలో తెలుగు ప్రజల ఇబ్బందులు గమనించి ప్రత్యేక రాష్ట్రం కోసం 58 రోజులు నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను త్యాగం చేశారని గుర్తు చేశారు. ఈ ప్రాంతంలో ఆర్యవైశ్యులు వ్యాపారాలను సంతోషంగా ఉండేలా రాష్ట్రం అభివృద్ధి చెందేలా తెలుగు ప్రజలు అందరూ కలిసికట్టుగా పని చేయాలని, తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీలు కలసికట్టుగా పనిచేస్తూ ప్రజల సంక్షేమం కోసం ముందుకు సాగుతున్నాయని ఎమ్మెల్యే తెలియజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మన యువ నాయకులు నారా లోకేష్ సారధ్యంలో రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందని చెప్పారు. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ రాకేష్ మాట్లాడుతూ కందుకూరు నియోజకవర్గంలో ఆర్యవైశ్యులకు ఏదైనా కష్టం వచ్చిన వారికి అండగా ఉండటానికి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ముందుంటారని తెలిపారు. స్వర్గీయ పొట్టి శ్రీరాములు వర్ధంతిని డిసెంబర్ 15 ఆత్మార్పణ దినోత్సవంగా జరపాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర ఆర్యవైశ్యుల సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య డైరెక్టర్ తటవర్తి వాసు, నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు దర్శి హరికృష్ణ, ఆర్యవైశ్య మహాసభ ఆర్గనైజింగ్ సెక్రెటరీ పల్లపోతు వెంకటేశ్వర్లు ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షులు కోటా హనుమంతరావు, పట్టణ మండల పార్టీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, నార్నే రోశయ్య, జనిగిర్ల నాగరాజు మాదాల లక్ష్మీనరసింహం మరియు విగ్రహ కమిటీ నిర్వాహకులు, ఆర్యవైశ్య సోదరులు, కూటమి నేతలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi