Amaravathi Jyothi - Telagana / Hyderabad : మల్కాజిగిరి ఎంపీ పదవికి రేవంత్రెడ్డి రాజీనామా.. హైదరాబాద్, అమరావతి జ్యోతి: మల్కాజిగిరి ప్రజలకు రేవంత్రెడ్డి బహిరంగ లేఖ ఎంపీ పదవికి రాజీనామా చేసిన సందర్భంగా మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ (ట్విటర్) వేదికగా బహిరంగ లేఖ రాశారు. ''అప్రతిహత అధికారాన్నే అస్త్రంగా చేసుకుని, అణచివేతనే మార్గంగా ఎంచుకుని, ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకే లేకుండా చేయాలని పాలకులు కక్షగట్టినప్పుడు.. తెలంగాణలో ప్రజాస్వామ్య పరిరక్షణకు, ప్రశ్నించే గొంతుకకు ప్రాణం పోసిన గడ్డ మల్కాజిగిరి. కొడంగల్లో పోలీసు నా ఇంటిపై పడి, నన్ను నిర్బంధించడం చూసిన ఇక్కడి ప్రజలు ఆరు నెలలు తిరగకముందే నన్ను గుండెల్లో పెట్టుకున్నారు. ప్రశ్నించే గొంతుకగా మార్చి తెలంగాణ మొత్తానికి రక్షణగా నిలబెట్టింది ఈ ప్రాంతం. ఈ రోజు మీ రేవంత్ అన్న సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గడ్డపై జెండా ఎగరేసిందంటే దానికి పునాదులు పడింది మల్కాజిగిరిలోనే.. నన్ను దేశానికి పరిచయం చేసిన ఘనత మల్కాజిగిరి ప్రజలదే.. నా రాజకీయ ప్రస్థానంలో కొడంగల్కు ఎంతటి ప్రాధాన్యత ఉందో.. మల్కాజిగిరికి అంతే ప్రాధాన్యత ఉంది. నన్ను దేశానికి పరిచయం చేసిన ఘనత మల్కాజిగిరి ప్రజలదే. ఏ విశ్వాసంతో, ఏ అభిమానంతో నన్ను గెలిపించారో ఎంపీగా ఐదేళ్లు ప్రజల పక్షాన రాజీలేని పోరాటం చేశా. విస్తృత బాధ్యతల నేపథ్యంలో వ్యక్తిగతంగా కొన్ని సార్లు అనుకున్నంత సమయం కేటాయించలేకపోయాను. అలాంటి సందర్భంలో నా పరిస్థితిని మీరు సహృదయంతో అర్థం చేసుకున్నారు. తల్లి తన బిడ్డను దేశ రక్షణ కోసం పంపినట్టు.. నన్ను మీరు తెలంగాణ రక్షణ కోసం గెలిపించి పంపారు. ఇన్నాళ్లు ఆ బాధ్యతను చిత్తశుద్ధిగా నిర్వర్తించానని భావిస్తున్నా.. ఈ సందర్భంగా మల్కాజిగిరి ప్రజలకు పేరు పేరునా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ఐదేళ్లే కాదు.. ఇకపై మీతో నా అనుబంధం.. నా గుండెల్లో మీ స్థానం శాశ్వతం. మల్యాజిగిరి ప్రాంతం.. ఇక్కడి ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటా. నాడు మీరు పోసిన ఊపిరి... నా చివరి శ్వాస వరకూ తెలంగాణ ఉజ్వల భవిత కోసం తపిస్తూనే ఉంటుంది'' అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు..
Admin
Amaravathi Jyothi