Amaravathi Jyothi - Telagana / Hyderabad : తెలంగాణలో మూడో శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజిట్ జారీ గవర్నర్ తమిళిసైని కలిసిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ హైదరాబాద్, అమరావతి జ్యోతి: తెలంగాణలో కొత్త శాసనసభను ఏర్పాటు చేస్తూ గెజిట్ జారీ అయ్యింది. గవర్నర్ తమిళిసైకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్ నేతృత్వంలోని బృందం ఈ గెజిట్ను అందజేసింది. గెలుపొందిన ఎమ్మెల్యేల జాబితాను కూడా గవర్నర్కు సీఈవో వికాస్రాజ్ అందజేశారు. దీంతో తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ ఏర్పాటైంది. ఇక కొత్త ముఖ్యమంత్రికి సంబంధించిన ప్రమాణ స్వీకార ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది. ఈసీ బృందం గవర్నర్ను కలవడంతో కాంగ్రెస్ ప్రతినిధి బృందం కూడా గవర్నర్ను కలవనుంది. కాంగ్రెస్ శాసన భాపక్షనేతగా ఎన్నికైన వారి పేరును గవర్నర్కు నివేదించి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరతారు. అనంతరం సీఎల్పీ నేతకు డిజిగ్నేటెడ్ సీఎం హోదా ఇచ్చి ప్రమాణ స్వీకారానికి గవర్నర్ ఆహ్వానిస్తారు. వీలైనంత వరకు ఈ ప్రక్రియ ఇవాళే జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మంత్రులకు వాహనాలు సిద్ధం : ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం కోసం రాజ్ భవన్లో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇవాళే ప్రమాణ స్వీకారం ఉండవచ్చన్న సమాచారం నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమం కోసం అవసరమైన కుర్చీలు, టెంట్లు, సహా ఇతరత్రా సామగ్రిని ఇప్పటికే తరలించారు. సాధారణ పరిపాలనా శాఖ, ఆర్అండ్బీ, జీహెచ్ఎంసీ సహా ఇతర శాఖల అధికారులు అవసరమైన కసరత్తు చేశారు. శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు రాజభవన్కు వెళ్లి.. ప్రస్తుతం అసెంబ్లీ రద్దు తీర్మాన ప్రతిని గవర్నర్కు అందించారు. కొత్త మంత్రుల కోసం వాహనాలను అధికారులు సిద్ధం చేశారు. దిల్కుష్ అతిథి గృహానికి వాహనాలను సిబ్బంది తీసుకొచ్చారు.
Admin
Amaravathi Jyothi